29, ఏప్రిల్ 2011, శుక్రవారం

తెలంగాణ సిద్దాంత కర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్

యాంకర్
ఆచార్య కొత్తపల్లి జయశంకర్.. తెలంగాణ ప్రజలకు పరిచయం అక్కరలేని పేరు. తెలంగాణ బిడ్డలు తరాల సంది పడుతున్న తండ్లాటను కండ్లార చూసి చలించిన మేథావి. ఆయన పుట్టింది పోరాటాల పురిటిగడ్డ వరంగల్ జిల్లా అక్కంపేట గ్రామం..ఈ బుద్దిశాలిని కన్న ధన్యజీవులు లక్ష్మీకాంతారావు, మహాలక్ష్మి. సాధారణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన జయశంకర్ బడుగు జీవుల బతుకు దెరువులను అతి దగ్గరనుంచి గమనించిండు..అందుకే ఆయన తొలి అడుగు నుంచి నేటి వరకు దగా పడ్డ బతుకులకు బాసటగా నిలిచిండు.
స్పాట్
జయశంకర్ ప్రస్థానం ఉపాధ్యాయ వృత్తితో మొదలయింది.. వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్, హైదరాబాద్ జిల్లాలలో టీచర్ గా పనిచేసిన్రు. తెలంగాణ అన్ని జిల్లాలతో ఆయనకు అనుబంధం ఉంది..ఉపాధ్యాయ వృత్తినుంచే అంచలంచలుగా లెక్చరర్ గా, ప్రొఫెసర్ గా ఎదిగిండు. అంతేకాక సీఫెల్, కాకతీయ యూనివర్సిటీ లకు రిజిస్ర్టార్ గా పనిచేసిన్రు. 1991 నుంచి 1994వరకు కాకతీయ యూనివర్సిటీకి వైస్ చాన్స్ లర్ గా బాధ్యతలు నిర్వహించిన్రు. ప్రధాని మన్మోహన్ సింగ్ జయశంకర్ గారి ప్రతిభను గుర్తించి 2004లో జాతీయ అసంఘటిత రంగ కమీషన్ కు లో నియమించిండు. తరువాత కాలంలో ఆపదవికి తనే స్వచ్ఛందంగా రాజీనామా చేసిండు.
స్పాట్
జయశంకర్ గారు తెలంగాణ ఎట్ల కన్నీళ్లు పెడుతున్నదో దగ్గర్నుంచి చూసిన్రు. తరగతి గదులకే పరిమితం కాలేదు. తెలంగాణ బిడ్డలు పడుతున్న కడగండ్లకు కారణమేంటో విప్పిచెప్పిండు.. తెలంగాణ బిడ్డలను ఎట్ల ధోకా చేస్తున్నరో తెలిపిండు. ఆయన అనుభవాలు వందల పిహెచ్ డిలతో సమానం..ఆయన స్పృషించని అంశంలేదు.. తెలంగాణ బిడ్డల యాతనకు మూలాలను శోధించిండు. నీళ్లల్లో, నిధులల్లో, ఉద్యోగాలలో సీమాంధ్ర నాయకులు ఎట్ల మోసపుచ్చుతున్నరో తెలిపిండు. తెలంగాణ సంస్కృతి పైనా, బాష పైన దాడెట్ల జరుగుతుందో అక్షరీకరించింన్రు.. ఆయన రాసిన తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్, తెలంగాణ విస్త్రుత అంగీకారం, తెలంగాణలో ఏమి జరుగుతుంది వంటి పుస్తకాలలో తెలంగాణ గతం, వర్తమానం కనిపిస్తయి.
స్పాట్
తెలంగాణ విముక్తి కొరకు జయశంకర్ గారు చేసిన సేవలు మరువలేనివి.. ఆయన చేసిన మేథోశ్రమ నభూతో నభవిష్యతి.. విద్యార్ధిగా ఉన్నపుడే 1952లో నాన్ ముల్కీ గో బ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నడు. 1954లో ఫజల్ అలీ కమీషన్ ముందు తెలంగాణ నుప్రత్యేక రాష్ర్టంగా ఉంచాలని వాదించిన్రు. 1955 -56 మద్యకాలంలో విశాలాంధ్ర వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్నరు. 1968-69లలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్రపోషించిన్రు. తెలంగాణ కోసం పనిచేసే ప్రతి శక్తిని కలుపుకోవాలని పిలుపునిచ్చిండు..
స్పాట్..
1969-1996 మధ్య కాలంలో తెలంగాణ కోసం పని చేసే సంఘాలకు, వ్యక్తులకు పెద్దదిక్కుగా నిలిచిండు. 1997లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పురుడు పోసుకున్న తెలంగాణ ఐక్య వేదిక ద్వారా ప్రత్యక్షంగా నాయకత్వ బాధ్యతలు చేపట్టి, నాలుగేండ్లుగా ఉద్యమాన్ని నడిపించిన్రు. తెలంగాణ రాష్ర్ట సమితి ఆవిర్భావ దశలోనాయకత్వాన్ని, కార్యకర్తలను, చైతన్యం పరచడంలో ఆయన పాత్ర మరువలేనిది. ఆర్ యస్ యు నుంచి ఆర్ యస్ యస్ వరకు తెలంగాణ కోసం ఎవరు పిలిచినా అరమరికలు లేకుండా ఉద్యమ సభల్లో పాల్గొని తన గొంతు వినిపించేవారు.
స్పాట్
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతున్న దశలో.. తెలంగాణ ఉద్యమ సారధి కేసిఆర్ గారికి వెన్నుదన్నుగా ఉంటూ ..యావద్భారత రాజకీయ ప్రముఖుల మద్దతు కూడ గట్టడంలో ముఖ్యపాత్రపోషించిన్రు జయశంకర్ గారు. తెలంగాణ రాష్ర్ట సమితి అధినేత కేసిఆర్ గారే జయశంకర్ గారిని తన గురువుగా భావిస్తరు. ఎందుకంటే 2004 సంవత్సరం నుంచి 2009 నవంబర్ 9 న తెలంగాణ రాష్ర్ట ప్రకటన వెలువడే వరకు అందరు నాయకులను కలిసి తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు ఒప్పించడంలో కేసిఆర్ గారితో బాటు ముఖ్యపాత్ర పోషించిన్రు. మూడు తరాల కడగండ్లను కండ్లార చూసిన సామాజికవేత్త. తెలంగాణలో ప్రతి విషయాన్ని కండ్లకు కట్టినట్టు వివరించిన్రు. అందుకే ఆయనను మీడియా తెలంగాణ సిద్దాంత కర్త అని అభివర్ణించడం అక్షరాలా నిజమే.. నిజాయితీ గల సిద్దాంతకారుడికి నిలువెత్తు నిదర్శనం జయశంకర్ గారు..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి