29, ఏప్రిల్ 2011, శుక్రవారం

మిట్టపల్లి సురేందర్ ( కవి, గాయకుడు)

మిట్టపల్లి సురేందర్….
అడవి బిడ్డల గుండె గొంతును తన కలంతో పలికించినోడు..(ఆదిలాబాద్ జిల్లరా పాట బ్యాక్ గ్రౌండ్) పల్లెపచ్చదనాన్ని పండువెన్నెల చల్లదనాన్ని తన పాటలల్లో ఒదిగించినోడు..(పండువెన్నల పాట బ్యాక్ గ్రౌండ్) ఉద్యమ పాటలకు ఊపిరి పోసిన పల్లెకవి.. ఎండుటాకుల వెన్నుపూసలు దీసి ఆయుధాలనిచ్చి, అడవి పోరాడమన్నదని విప్పి చెప్పిండు. కన్నబిడ్డలను కోల్పోయిన వీరమాతల గర్భశోకాన్ని తలచి రాతి బొమ్మలల్ల కొలువైన శివుణ్ని ఇదేం రాత అని ప్రశ్నించిండు. తలరాతను మార్చే బతుకుకోసం ఎదిరించి పోరాడమని బోధించినోడు మిట్టపల్లి సురేందర్.
స్పాట్
మధురమైన పాటలు రాసిన మిట్టపల్లి సురేందర్ పుట్టింది వరంగల్ జిల్లా చిట్యాల మండలం..వెల్లంపల్లిగ్రామం. తండ్రి నర్సయ్య, తల్లి మధునమ్మ. తన పాటకు ప్రాణం పల్లె జీవితమే నంటడు..తాను రాసిన గేయాలన్నీ బడుగు జీవుల మనసు గాయాలను మాన్పేవేనని సగర్వంగా చెప్పుకుంటడు. గోరటి వెంకన్న, చంద్రబోస్, అందెశ్రీ, వేటూరి వంటి కవులు రాసిన సాహిత్యం తన పాటలకు స్పూర్తని అంటడు. సురేందర్ గుభాళించిన సాహితీ సౌరభాలు తెలంగాణ పల్లెల్లో ఇంటింటా గుప్పుమంటున్నయి. సురేందర్ సినిమాల్లో కూడా పాటలు రాసిండు. నాన్ స్టాప్, ధైర్యం వంటి చిత్రాల్లో సినీగేయాలు రాసి సినీ ప్రముఖుల చేత శబాష్ అనిపించుకున్నడు. సురేందర్ స్పృషించని సామాజిక అంశం లేదు, తాకని తండ్లాట లేదు. ఇన్ని పల్లె పాటలు రాసిన సురేందర్ మరిన్ని మంచి పాటలు రాయాలని కోరుకుందాం..
వడ్లకొండ అనిల్ కుమార్..
సురేందర్ కలానికి గళమైనిలిచిన వ్యక్తుల్లో అనిల్ ఒకరు. పాటకు కొత్త హొయలు దిద్ది ప్రాణం పొసిన గాయకుడు. పుట్టింది కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం, జమ్మికుంట గ్రామం. తండ్రి మొగిలయ్య, తల్లి సుగుణమ్మ. బార్డర్ లో సైనికుడా పాటతో వడ్లకొండ అనిల్ కుమార్ ప్రపంచానికి పరిచయం అయిండు. యం. కామ్ పూర్తి చేసిన అనిల్ చదువుకునేటప్పటి నుంచే తన గళానికి పదును పెట్టిండు. యన్ యస్సెస్ లో ఢిల్లీ రిపబ్లిక్ డే కు సెలక్టయిండు. ఆ అవకాశంతో ఢిల్లీ వారణాసిలలో పాటలు పాడిండు. తన పాటలు ఖండాతంరాలను వ్యాపింపజేసిండు అనిల్. మలేషియా వంటి దేశాలలో కూడా తన గళమాధుర్యాన్ని వినిపించిండు.
స్పాట్( ఇద్దరివి కలిపి)
తెలంగాణ కళాకారులు మిట్టపల్లి సురేందర్, వడ్లకొండ అనిల్ కుమార్ లు మరిన్ని స్వరశిఖరాలు అధిరోహిచాలని కోరుకుందాం..

ఆకునూరి దేవయ్య (తెలంగాణ గళం)

ఎ.జనార్ధన్
స్పాట్
తెలంగాణ ఉద్యమంలో ఎందరో కవులు గాయకులు తమ పూర్తి కాలాన్ని ఉద్యమానికి అంకితం చేశారు. తెలంగాణలో ఊరూరా వాడవాడనా ఇటువంటి కవి గాయకులకు కొదవలేదు. తెలంగాణలో ఏ కొమ్మను కదిలించినా జానపదాలను జల్లున రాల్చుతది. ఉద్యమ పాలటను ఊటలా రాల్చుతది. అలువంటి పాటల ఊటే ఆకునూరి దేవయ్య.
స్పాట్
ఆకునూరి దేవయ్య పుట్టింది కరీంనగర్ జిల్లా సిరిసిల్ల గ్రామం. తండ్రి ఆకునూరి నర్సవ్వ, తండ్రి వెంకటయ్య. డిగ్రీ వరకు చదువుకున్న దేవయ్యకు పాటంటే ప్రాణం. స్కూల్ చదివేటపుడే దేవయ్యలో పాటగాడు నిద్రలేచిండు. తన తోటి వారి ముందు జానపద గీతాలు ఆలపించి శబాస్ అనిపించుకున్నడు. అదే స్పూర్తి దేవయ్యలో కొనసాగింది. ఏ కొత్త జాన పదం విన్నా ఇట్టే పట్టేస్తడు. జాన పదాలను సేకరించి ముందు తరాలకు అందివ్వాలనే లక్ష్యంతో పనిచేస్తుండు.
స్పాట్
ఆకునూరి దేవయ్య పాటలకు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. ఇప్పటికే ఎన్నో ప్రదర్శనలిచ్చిండు. మొట్టమొదటి సారిగా 1984లో రేడియోలో జానపదగీతాన్ని ఆలపించిండు. ఆ తరవాత రేడియోలో ఎన్నోప్రదర్శినిచ్చిండు. 1994లో దూరదర్శన్లో కూడా జానపదాల రుచి చూపించి ప్రజలకు మరింత చేరువయిండు.
స్పాట్
తెలంగాణ మలిదశ ఉద్యమంలో దేవయ్య పాత్ర మరవలేనిది.ఎన్నో తెలంగాణ ధూంధాలలో పాల్గొని ప్రజాచైతన్యం కోసం పాటు పడిండు. ఆయన ఆలపించిన తలాపునా పారుతుంది గోదారి అన్నపాట, రేలాదూలా అన్న పాట ప్రజా బాహుళ్యంలో ఇంకిపోయినయి.ఒక్కకరీంనగర్ లోనే కాదు తెలంగాణ ప్రాంతం మొత్తంలో ఈ పాటలు మార్మోగి పోయినయి.
స్పాట్

నర్సిరెడ్డి, నల్లగొండ సైదులు (ఉద్యమ గళాలు)

Mm pkg 17/04/2011
తెలంగాణ మాగాణం నిండా తడి ఆరని గాయాలే.. ఈ గాయాలను మాన్పే గేయాలు ఎన్నో పుట్టుకొచ్చినయి. ఆ గేయాలు కళాకారుల గళంలో నిప్పు కణికలై చిచ్చర పిడుగులై దోపిడి దారుల గుండెల్లో మంటలు రేపినయి. తెలంగాణ కళామతల్లి బిడ్డలంతా ఒక్కటయిన్రు. పచ్చని పైర్లను కలలు గన్న నా తెలంగాణ పడావెందుకు బడ్డదని గొంతెత్తిన్రు. అలా ఊరూరా వాడ వాడనా కళాకారులు ఉద్యమంలో గళం కలిపిన్రు. అలా వెలిగిన తెలంగాణ కళామతల్లి నుదిటి సింధూరాలే.. సైదులు, నర్సిరెడ్డి.
Intro Anchor
పాటంటే నర్సిరెడ్డికి ప్రాణం.. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఎందరో మేటి కళాకారులకు ఏకలవ్య శిశ్యుడుగా ఎదిగిన నర్సిరెడ్డి, ఉద్యమమే ఉపిరిగా.. ఎన్నో ధూంధాం సభలల్లో గళం వినిపించిన నకిరెకంటి సైదులు మనతో ముచ్చట బెట్టేందుకు టి. న్యూస్ కు వచ్చిన్రు.
Voice over
తెలంగాణను పరాయి పాలననుంచి విముక్తి కలిగించేందుకు ఎందరో కళాకారులు తమ గళాలకు పదును పెట్టిన్రు. తెలంగాణ పది జిల్లాలలో పదం నేర్చిన ప్రతి బిడ్డా, పాట నేర్చిన ప్రతి గాయకుడు ఉద్యమానికి ఊతమయిన్రు. అలా తెలంగాణ ఉద్యమంలో తన వంతుగా పాటలు రాస్తూ పాడుతున్న కళాకారుడు నకిరికంటి సైదులు.
స్పాట్
ఒళ్లంతా ఉద్యమ సారాన్ని నింపుకున్నట్టు గళమెత్తుతున్న ఈ కళాకారుడి పేరు నకిరికంటి సైదులు. సైదులు పుట్టింది నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం కాజీరామారం గ్రామం. తండ్రి పాపయ్య, తల్లి సాలమ్మ. సైదులుకు చిన్నప్పటి నుంచి పాటలు పాడటమంటే చాలా ఇష్టం . ఆ ఇష్టమే అతణ్ని ప్రజానాట్యమండలి వైపు నడిపించింది. విద్యార్ది ఉద్య మాల్లో చురుకైన పాత్రపోషించిన సైదులు తరువాత ఉద్యమం వైపు నడిచిండు. 2007 నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నడు. తెలంగాణకు జరిగిన ధోకా మీద పాటలు గట్టిండు. ఇప్పటి వరకు దాదాపు 150 ధూంధాంలలో పాల్గొన్నడు. 25 ఏళ్లుగా ఉద్యమగీతాలు ఆలపిస్తున్న సైదులు స్వరాలు ఉద్యమానికి మరింత ఊపునిస్తయని ఆశిద్దాం.
స్పాట్
చాలా మందికి పాట పాడాలని ఉంటది..కానీ పాట పాడగల గళం కొందరికే సొంతం.. ఒకవేళ పాట పాడ గలిగినా.. ఎవరికి వారికి ఓ స్టైల్ అంటూ ఉంటది. కానీ ఇక్కడ మనం చూస్తున్న ఈ కళాకారుడు ఉద్యమ ప్రస్థానంలో దిట్ట అనుకుకున్న మేటి కళాకారుల గొంతులను తన గళంలో ఒంపుకొని వారే ఇతనిలోకి పరకాయ ప్రవేశం చేసిన్రా అన్నట్టుగా పాడగలడు. ఒకే గళంలో వివిధ రకాల వ్యక్తుల గొంతులను పలికించ గల స్వరవిన్యాసం నర్సిరెడ్డికే సొంతం. నర్సిరెడ్డి పుట్టింది నల్లగొండ జిల్లా చండూరు మండలం గుండ్రపల్లి గ్రామం. 12 సంవత్సరాల నుంచి పాట పాడుతున్న నర్సిరెడ్డి ఎన్నో సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నరు.
స్పాట్

రామాచారి (సంగీత దర్శకులు, మ్యూజిక్ డైరక్టర్, సింగర్

ఎ. జనార్ధన్
కొమాండూరి రామాచారి..ఇప్పడీ పేరు తెలియని సంగీత సాధకులు లేరంటే నమ్మలేం.. అంతగా సంగీత సరస్వతి పుత్రుల మదిని దోచిన స్వరసంపాదకుడు రామాచారి.. ఛానళ్లలో ప్రసారమవుతున్న మ్యూజికల్ ప్రొగ్రాంలలో ఆయన శిశ్యులే అధికం.. ప్రతి పదిమందిలో ఒకరు రామాచారి శిశ్యలమని గర్వంగా చెప్పుకుంటరు.. ఒక్కరు కాదు ఇద్దరు కాదు వందలాది మందిని గాయకులుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనది..ఈ కఠోర తపస్సు వెనక సంవత్సరాల తరబడి చేసిన శ్రమ, పట్టుదల, ఆవేదన. ఆశయం ఉన్నయి. పాటే తన పంచ ప్రాణాలంటడు..తన జీవితమే ఒక పాటని అంటడు..
స్పాట్ (సాంగ్)
సంగీతస్వరసృష్టికర్త రామాచారి పూర్తిపేరు కొమాండూరి రామాచారి.. సినీ పరిశ్రమలో ఈయన్ను శ్రీరామ్ కౌశిక్ గా పిలుచుకుంటరు.. ఈ స్వరశిఖామణి 1964 జనవరి 27న జన్మించిన్రు. తండ్రి కృష్ణమాచార్యులు తల్లి యశోద.. మెదక్ జిల్లా శివంపేట మండలం గొట్టిముక్కల స్వగ్రామం.. రామాచారికి చిన్నప్పటి నుంచి పాటలు పాడటమంటే ఆసక్తి. స్వరమే తన సర్వస్వమని భావించిండు..అంతేకాదు గాయకుడిగా రాణించాలనే బలమైన తపన.. ఆ తపనే తనను సంగీతం వైపు నడిపించింది. బిఎ, బిఇడి డిగ్రీలతో పాటు సంగీతభూషణ్ కోర్సును అభ్యసించింన్రు.. మ్యూజిక్ టీచర్ ట్రైనింగ్ కోర్సు పూర్తి చేసి సంగీతం మాస్టార్ గా కెరీర్ ప్రారంభించిన్రు. తన అనుభవాన్ని జోడించి విద్యార్ధులకు సంగీతంలో మెళకువలన్నీ నేర్పేవారు. వందలమంది విద్యార్ధుల చేత కచేరీలు ఇప్పించడం ఛానళ్లకు పరిచయం చేయండం చేస్తుండే వాడు.. ఆయన తొలిపాట 1979లోఆకాశవాణిలో ప్రసారమై ఖండాంతరాలు వ్యాపించింది. అప్పుడు మొదలైన ఆ సంగీత ప్రస్థానం ఎన్నో మైలు రాళ్లు అధిగమించింది.. ఇప్పుడు రాష్ర్టంలో రామాచారి అంటే తెలియని వారు లేనంత ప్రాచుర్యం పొందిన తెలంగాణ కళామతల్లి ముద్దుబిడ్డ రామాచారి..
స్పాట్
రామాచారి తన సంగీత సోపానాలలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నరు..ఒక దశలో తాను పడ్డ కష్టాల కొలిమిలో తన ఆశయం ఆవిరవుతుందేమోనని భయపడ్డడు కూడా.. ఎంతో మందికి టాలెంట్ ఉండి కూడా ప్రొత్సాహంలేక, సరియైన శిక్షణ లేక మరుగున పడుతున్నరని గ్రహించిండు.. అందుకే తాను పడ్డ ఇబ్బందులు మరెవరూ పడకూడదని 1999లో లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ నెలకొల్పి లేత స్వరపుష్పాలను ఒక్కచోట చేర్చి సంగీత శిక్షణ నిస్తున్నారు. పాడగల ప్రతి శిశువుకూ పైసా తీసుకోకుండా పాటనేర్పుతున్నరు. ఈ ఉచిత సేవ వెనుక మథర్ థెరిస్సా సేవా భావమే స్పూర్తి అని చెప్పుకుంటడు. ఒక సంగీత శిక్షకుడి గానే కాక మంచి గాయకుడిగా, సంగీత దర్శకుడిగా కూడా పేరు తెచ్చుకున్నరు రామాచారి.
స్పాట్
రామాచారి ఎన్నో ప్రైవేట్ ఆల్బంలలో పాటలు పాడిన్రు. సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేసిండు..శ్వేతనాగు, శ్రీరామదాసు, బాలరామాయణం, సంబరం వంటి చిత్రాలలో పాటలు పాడిన్రు. సమాంతరరేఖలు, బుచ్చిబాబు, పరమానందయ్య శిశ్యుల కథ, వంటి సీరియల్స్లో కూడా పాటలు పాడిన్రు. ఇవికాక అనేక భక్తి గీతాల ఆల్బంలలో స్వరాలాపన చేసిన్రు. ప్రేమలేఖ రాశా సినిమాకు సంగీత దర్శకులుగా పని చేసిన్రు.
స్పాట్
రామాచారి కీర్తి ఖండాంతరాలకు వ్యాపించింది.. దేశం నలుమూలలా పాడటంతో బాటు దుబాయ్, షార్జా, కువైట్, అమెరికా వంటి దేశాలలో పాటలతో స్వరసమ్మోహితులను చేసిన్రు. ఇప్పటికీ ఎందరో విద్యార్ధులచేత దేశవిదేశాలలో కచేరీలు ఇప్పించే అవకాశం కల్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నరు.
స్పాట్
రామాచారి సరసన ఎన్నో అవార్డులు చేరి తమ గౌరవాన్ని పెంచుకున్నయి. కళారాధన, అనురోధ్, శిల్పా ఆర్ట్స్, యువశక్తి వంటి అవార్డులు ఆయన ఖాతాలో చేరినయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం నంది అవార్డునిచ్చి సత్కరించింది..రామాచారి సంగీత గమకాల గమనంలో తన సతీమణి సుజాత సహకారం మరువలేనిదని చెప్పుకుంటడు. అంతేకాదు రామాచారి పిల్లలు కూడా తండ్రికి తగ్గ పిల్లలుగా రాణిస్తున్నరు. కుమారుడు సాకేత్, కూతురు సాహితి ఇరువురు కూడా పాటలు పాడటంలో తండ్రికి తగ్గ బిడ్డలుగా తమను తాము రుజువు చేసుకుంటున్నరు. ఆ ఇల్లు సంగీత వనం.. రేపటి స్వర పుష్టాలకు వనమాలి రామాచారి.

రసమయి బాలకిషన్ (తెలంగాణ ఉద్యమ గళం)

ఎ.జనార్ధన్
తెలంగాణ పల్లెసిగలో సాహిత్య మందారాలు పరిమళిస్తయి. అందులో మొగ్గగానే మగ్గిపోయిన జానపదాలు కొన్నైతే.. ఉద్యమాల బాటలో రాలిపోయిన మౌన రాగాలు కొన్ని. ఆ ఆవేదనలను గుండెకు హత్తుకొనేలా వినిపించే వాడే కళాకారుడు. అటువంటి కళాకారులకు తెలంగాణ మాగణమే కాణాచి.ఆ మట్టిలోంచి పుట్టిన సాహత్యమాణిక్యమే రసమయి బాలకిషన్..
స్పాట్
రసయయి బాలకిషన్.. తెలంగాణ సాహిత్యాభిమానులందరికీ బాగా పరిచయం ఉన్న పేరు. ఆ మాట కొస్తే ఏ చిన్న పిల్లవాణ్ని అడిగిన ఆయన పేరు ఇట్టే చెప్పేస్తరు. ఎందుకంటే ఆయన మాటటు మంత్రాల్లా ఆకట్టుకుంటయి. ఆ పదాల్లో వశీకరణ సూత్రాలు తొణికిసలాడుతుంటయి. ఒక విషయాన్ని విప్పిచెప్పాలంటే రసమయికి సాటిలేరు. ఎందుకంటే ఆయన చెప్పే పిట్టకథయినా కట్టుకథయినా మనసుకు హత్తుకొని తీరాల్సిందే. ఇక తెలంగాణ పాటకు ప్రాణం పోసి..వాటిని ఇంటింటా సుప్రబాతాల్లా సవ్వ్డడి చేయించడం రసమయికే చెల్లింది. మన మట్టిలో మరుగున పడ్డ జానపదాలకు జీవజలాన్ని గుప్పించి జలపాతంలా దుంకించడంలో రసమయి కూడా తనవంతు పాత్రపోషించిండు.
స్పాట్
తెలంగాణ ఉద్యమంలో పాటే ఆయుధం..ఉడుకెత్తించే నాలుగు మాటలకన్నా ఒక్కపాట పరుగులెత్తిస్తది. అలా ఉద్యమంలోకి ఉరుకులు పెట్టించడంలో రసమయి అందెవేసిన చేయి. వృత్తి రీత్యా ఉపాద్యాయుడు కావడం వల్ల విషయాన్ని విపులంగా చెప్పడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఈ కదిలే జానపదాల గ్రంధాలయం పుట్టింది మెదక్ జిల్లా సిద్దిపేట మందలం రావురూకల గ్రామం..రసమయి అసలు పేరు వేల్పుల బాలకిషన్. జానపదాలన్నా గ్రామీణ వాతావరణమన్నా, అచ్చమైన తెలంగాణ యాసన్నా ఆయనకు వల్లమాలిన అభిమానం. అందుకే ఇంటర్ లోనే రసమయి అనే సాహితీ సంస్థను ఏర్పాటు చేసిండు. ఆ సంస్థ పేరే తరువాత ఇంటి పేరయింది.
స్పాట్
రసమయి ఒక్క తెలుగులోనే కాదు కన్నడంలో కూడా పాడగలడు. తెలంగాణ ఉద్యమంలో రసమయి పాత్రమరవలేనిది. ఆయన పాల్గొన్న ఉద్యమ సభ ఏదైనా సరె వలస పాలకుల ధోకాను విప్పి చెప్పేవాడు. పాఠ్యపుస్తకాల్లో ఉన్న పరవళ్లు పంట పొలాల్లో ఎందుకు లేవో వివరిస్తడు. బడుగు జీవుల బతుకులెట్లున్నయో గుండె గొంతుకలోంచి వినిపిస్తడు. నిజ జీవితంలో రగిలిన నిట్టూర్పులను ఒడిసిపట్టిండు కాబట్టే ఉద్యమ సెగలను పల్లెపల్లెనా పంచిపెట్టిండు. తెలంగాణ ధూంధాం పేరుతో కళాకారలందరి గళాలను ఒక్కవేదిక పైకి తెచ్చిండు. కామారెడ్డిలో కదిలిన ధూంధాం పల్లెపల్లెకూ విస్తరించింది. ఉద్యమ సభలన్నీ ఇవాళ ధూంధాం లేకుండా జరగట్లేదంటే దానికి తాను వేసిన పునాదే కారణమంటడు బాలకిషన్.
స్పాట్
తెలంగాణ కలాలను, గళాలను ఊరూరా విస్తరించడంలో రసమయి బాగా కృషి చేసిండు. ఆయన తీసిన సిడిలలో ఊరు తెలంగాణ వంటి వీడియో సిడి అత్యంత ప్రజాదరణ పొందింది. ఇందులో పల్లె వెతలను పట్టి చూపిండు. ఎన్నో ఆడియో సిడిల ద్వారా ఉద్యమ గేయాలను ప్రజలకు పంచిపెట్టిండు. అదే స్పూర్తితో ఇప్పుడు రసమయి యమలోకంలో జైతెలంగాణ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నడు. ఈ సినిమా దాదాపు పూర్తయి సెన్సార్ బోర్డు దగ్గరకు వెళ్లబోతోంది.
స్పాట్
పదేళ్లుగా జరుగుతున్న తెలంగాణ ఉద్యమంలో రసమయి ప్రత్యక్షంగా పాల్గొన్నడు. అరెస్టులు, జైళ్లు ఆయనకు మామూలే. తెలంగాణ ఉద్యమానికి ఒక సైనికుడి మాదిరిగా పనిచేసిండని చెప్తరు ఆయన గురించి తెలిసన వాళ్లు. నవ రసాలను ఒలికింప జేయగల రసమయి రాగాలు మరిన్ని పూయాలి. అవి తెలంగాణ మాగాణంలో వెల్లి విరియాలి.

రవి వర్మ (సినీ గాయకులు)

రవి వర్మ గాయకుడు
మనిషి ప్రాణ నాడులను తట్టిలేపే పాట పాడగలగడం కొందరికే సొంతం.. మోడువారిన మనసుకు స్వరపుష్పాలతో వసంతాన్ని చిలకరించ గల శక్తి ఒక్క పాటకే ఉంది. ఆ గానామృత ధారలను కురిపించే శక్తిని సొంతం చేసుకోవడం ఒక వరం. ఆ వరాన్ని పొందిన మెలోడి అండ్ మాస్ సింగర్ రవివర్మ.
స్పాట్
రవివర్మది మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ మండలం, దుండ్యాల గ్రామం. తండ్రి నారాయణాచారి, తల్లి,సరోజినమ్మ. భార్య సుమ, కూతురు సహన.. రవి చదువంతా వరంగల్లోనే సాగింది. కళాశాల వయసు నుంచే పాటలంటే రవివర్మకు ప్రాణం. గాయకుడిగా ఎదగాలని ఎంతో తపించేవాడు. దానికోసం ఎంతో ప్రయత్నించిండు. ఆయన తొలిసారి చిత్రం సినిమాలో పాడిన ఢిల్లీ నుంచి గల్లీ దాక అనే పాట కెరీర్ లో మొదటి పాటగా నిలిచింది. ఈ పాట రవివర్మ కెరీర్ను మలుపుతిప్పింది. గల్లీ నుంచి ఖండాంతరాలను దాటించింది.
స్పాట్
రవి వర్మ మంచి సంగీత దర్వకత్వ పటిమ గల వ్యక్తి కూడా. ఆయన స్వయంగా వైరస్ అనే ఆల్బం ద్వారా సంగీతాభిమానులకు మరింత చేరువయిండు. తెలుగు సంగీత ప్రపంచంలో రవివర్మ తరదైన ముద్ర వేసుకోగలిగిండు. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్ , కన్నడ భాషల్లో ఎన్నో పాటలు పాడిండు. ప్రైవేట్ ఆల్బంలలో 500లకు పైగా పాటలు పాడిండు.
స్పాట్
తెలుగు సినమాల్లో రవివర్మ పాడిన పాటల్లో మాస్ సినిమాలో మమమాస్పాట..ఇడియట్ లో చెలియా చెలియా పాట..భద్ర సినిమాలో ఓ మనసా ఓమనసా అనే పాట చాలా ప్రజాదరణ పొందినయి. జయం సినిమాలో బండి బండి రైలు బండి పాటకూడా చిన్నపిల్లలనుంచి పెద్దవాళ్ల దాకా హమ్మింగ్ చేసేదే..లారెన్స్ యాక్ఠ్ చేసిన స్టైల్ మూవీలో టైటిల్ సాంగ్ ప్రతి డాన్స్ లెర్నకు ఉత్తేజాన్నిచ్చే మంత్రం.
స్పాట్
రవివర్మ గళంలో మాస్ మసాలా పాటలు, మెలోడి మధురిమలు అలవోకగా ఒదిగిపోతయి. ఆ సుస్వరాల సవ్వడిని ఎంత విన్నా తనివి తీరదు. అందుకే ఎందరో సంగీత దర్శకులు ఆయన పాటలకు అభిమానులై పాడించుకున్నరు. తెలంగాణ స్వరమాంత్రికుడు చక్రి, మ్యూజిక్ తో మాజిక్ చేసే కీరవాణి,. సూపర్ మ్యూజిక్ డైరక్టర్ మణిశర్మ., యూత్ఫుల్ మ్యూజిక్నందించే ఆర్పీ పట్నాయక్లు రవివర్మ గమకాలతో గందర్వస్వరాలను మదించిన్రు.
స్పాట్
రవివర్మ స్వరాలకు తగిన గుర్తింపే లభించింది. ఎన్నో అవార్డులు ఆయన సరసన చేరి ఉప్పొంగిపోయినయి.ఆయన పాడిన తొలిపాటకే “అలాపన మ్యూజిక్ అవార్డు” సొంతం చేసుకున్నరు...చిత్రం సినిమాలో పాడిన డిల్లీ నుంచి గల్లీదాక పాటకు బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ విభాగంలో ఈ అవార్డు వచ్చింది. ఆర్య చిత్రంలో ఓ మైబ్రదరు అనే పాటకు 2004లో వంశీ స్పెషల్ జ్యూరీ అవార్డు ను సొంతం చేసుకున్నడు. 2006లో సంగం సుశీల యూత్ అవార్డును సొంతం చేసుకుండు. రవివర్మ కెరీర్లో ఎన్నోమైళ్లు అధిగమించిండు. తన విజయాల వెనక తనకుంటుంబ ప్రోత్సాహం చాలా ఉంటదని గర్వంగా చెప్పుకుంటడు రవివర్మ. రవివర్మ స్వరజల్లుల్లో మనమూ తడిసి తరిద్దాం..

యశ్‌ పాల్ (తెలంగాణ ఉద్యమ గళం)

ఎ. జనార్దన్
యశ్ పాల్ పోరాటాల పురిటి గడ్డ ఖమ్మం జిల్లా వాగ్గేయకారుడు. కమ్మునిస్టు ఉద్యమంలో పనిచేస్తూ, అరుణోదయ సాంస్కృతిక విభాగంలో పని చేస్తూ ఉద్యమాన్ని ఉరుకుల పెట్టించే పాటలు కట్టిండు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 500ల పైచిలుకు పాటలు రాసిండు..ప్రతి పాటా ఒక సందేశమిచ్చేదే.. యశ్ పాల్ పుట్టింది ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం కొండాపురం గ్రామం. తండ్రి వీరస్వామి తల్లి సుక్కమ్మ. పి.జి వరకు చదువుకున్న యశ్ పాల్ కు పాటలంటే ప్రాణం. తన అక్క శాంతమ్మ పాటలను నరనరానా జీర్ణించుకొని సాహిత్యం వైపు అడుగులేసిండు.
స్పాట్
యశ్ పాల్ పాటల్లో సాహిత్యం కంటే ఎక్కువ ప్రజల జీవితం ఉంటది. ఆవేదన ఉంటది. అణిచివేత పై ధిక్కారం ఉంటది. యశ్ పాల్ పాటల్లో వర్తమానం, చరిత్రల మేళవింపు ఉంటుంది. గ్లోబలైజేషన్ పై ఎక్కుపెట్టిన అస్ర్రాలు యశ్ పాల్ అక్షరాలు. పండుటాకులా ఎండిపోతున్న కులవృత్తులగురించి, గ్రామీణ ఆట పాటపై ఎన్నో పాటలు రాసిండు. యశ్ పాల్ పాటల్లో అమరులు నిద్దుర లేస్తరు. చుక్కలై వెలుగులు చిందుతరు. అవిసి పోతున్న ఆటపాటల పై యశ్ పాల్ రాసిన పాటలు గ్రామీణ జీవితం కళ్లముందు కదలాడుతది.
స్పాట్
యశ్ పాల్ ఒక కవిగానే కాక గాయకుడిగా కూడా ప్రపంచానికి పరిచయం. యశ్ పాల్ సాహిత్యాన్ని మెచ్చుకున్న ఎందరో సినీ దర్శకులు తమ సినిమాల్లో పాటలు ప్రజాచైతన్య గీతాలు రాయించుకున్నరు. ఒక రచయిత గానే కాక తెలంగాణ ఉద్యమాల్లో, బీడీ కార్మికులు సమస్యలపై, మహిళల అణిచి వేతపై, ప్రత్యక్షంగా పాల్గొన్నడు. వలసలను నివారించేందుకు, ప్రాజెక్ట్ నిర్వాసితుల రక్షణకోసం చేసిన పోరాటాలలో ప్రత్యక్షం పాల్గొని అనేక సందార్భాలలో పోలీసు లాఠీల దెబ్బలు తిన్నడు. అరెస్టయినా మొక్కవోని ధైర్యంతో ఉద్యమంలో తన తోటి వారికి ఆదర్శంగా నిలిచిండు.
స్పాట్
ఉద్యమానికి సహకరించడం ఒక వంతయితే, కనుమరుగై పోతున్న గ్రామీణ సంస్కృతులను, సాహిత్యం కళలు, జానపదాలను సేకరించి ముందు తరాలకు వాటి గొప్పతనాన్ని తెలిపే ప్రయత్నం చేస్తున్నడు. రైతు ఆత్మ హత్యల పై, బీడి కార్మికుల వెతలపై, మధ్యానికి బానిసై చిద్రమవుతున్నకుటుంబాలపై, నేత కార్మికులు కడగండ్ల గురించి ఇలా చెప్పుకుంటూ పోతే యశ్ పాల్ తడమని సమస్య లేదు. రాయని తండ్లాట లేదు.
స్పాట్
మలి విడత తెలంగాణ ఉద్యమంలో యశ్ పాల్ పాత్ర మరువలేనిది. ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి కాలం పనిచేసి నిత్యం విద్యార్ధులను చైతన్య పరుస్తూ తన పూర్తి సమయాన్ని ఉద్యమానికి అంకితం చేసిండు. అనే క ధూంధాంలలో పాల్గొని ఉద్యమానికి తన వంతు సేవ చేసిండు.